Friday, April 24, 2020

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు - SC

రిజర్వేషన్‌ కులాల జాబితాలు సవరించాలి - SC

Apr 24 2020       @ 02:19 AM హోం జాతీయం

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు
అసలైన పేదలకు అందకుండా చేస్తున్నారు
జాబితాలు మార్చరాదన్న రూలేం లేదు
ఆ జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు
మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు
అనుగుణంగా కులాల జాబితాలు మార్చాలి
చాన్స్‌ దక్కనివారు ఆవేదన చెందుతున్నారు
ఏపీ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘‘రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే కులాల జాబితాలు మార్చాల్సిందే..  70 ఏళ్లుగా ఈ ఫలాలను అనుభవిస్తున్న వారు అసలైన పేదలకు అవి దక్కకుండా అడ్డుపడుతున్నారు. వారు దోచుకోకుండా చూడాలంటే కులాల లిస్టులు మార్చాలి. అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ శాతాన్ని మార్చాల్సిన పనిలేదు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు, ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు సూచించినట్లు ఈ జాబితాలను మార్చే పనిని చేపట్టడం ప్రభుత్వ కర్తవ్యం. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నాం....’’

 ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం

పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు

లక్షించారు. కానీ, ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొట్టాయి. జాబితాలు మార్చకుండా, రిజర్వేషన్‌ నిబంధనలను మార్చకుండా అలానే వదిలేశాయి.

సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్‌ కులాల జాబితాలు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులే రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారని, అసలైన పేదలకు, అవి దక్కాల్సినవారికి దక్కకుండా అడ్డుపడుతున్నారని గట్టిగా అభిప్రాయపడింది. ‘‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినపుడే రిజర్వేషన్‌ ఫలాలను -ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’’ అని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ఏరియాల్లో టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అడ్డంగా కొట్టేస్తూ వెలువరించిన 152-పేజీల తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ జాబితాలను నోటిఫై చేస్తారు.


వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నది సుప్రీం బెంచ్‌ తాజా తీర్పు.  ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ- ‘రిజర్వేషన్‌ కులాల జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు...అవి మార్చకూడదన్న రూలు కూడా ఏమీ లేదు’ అని జడ్జీల్లో ఒకరైన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పష్టం చేశారు. రాకేశ్‌ కుమార్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకిస్తూ- ‘మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా- ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలి’ అని కూడా పేర్కొన్నారు.

‘రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అనేక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇన్నేళ్ల రిజర్వేషన్‌ విధానం వల్ల అనేకులు సంపన్నులయారు. ఇవి అందని వర్గాలనేకం సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ సంపన్నవర్గాలు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఇది అంతర్గతంగా రిజర్వేషన్‌కు అర్హులైన వర్గాల్లోనే ఓ రకమైన ఘర్షణకు దారితీస్తోంది. ఎవరు అర్హులన్న ప్రశ్నకు తావిస్తోంది’ అని జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కులాల జాబితాలు సవరించాలంటూ సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ చేసిన వాదనతో బెంచ్‌ ఏకీభవించింది.

‘‘ప్రభుత్వాలు నియమించిన  కమిషన్లు... కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని, మరికొన్ని వర్గాలను కులాల జాబితాలో చేర్చాలని సూచిస్తూ వచ్చాయి. జాబితాలు సవరించాలని కూడా సిఫారసు చేశాయి. అలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్నపుడు వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ఆ నివేదికలకు అనుగుణంగా జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని కేంద్ర సర్కార్‌కు నివేదించాలి’’ అని బెంచ్‌ పేర్కొంది. (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌ కేసులో షెడ్యూల్డ్‌ ఏరియాలోని టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకు కేటాయించడం ద్వారా ఎస్సీలకు, బీసీలకు తగిన అవకాశం దక్కకుండా చేశారని బెంచ్‌ అభిప్రాయపడింది. ‘రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం దామాషా ప్రాతిపదిక కాదు.

సరిపడ్డ రీతిలోఈ రిజర్వేషన్‌ కలగజేయడం. రూల్‌ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సినది 6 శాతం రిజర్వేషన్‌ మాత్రమే. ఏకంగా నూరు శాతం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా కలగజేయడం షెడ్యూల్డ్‌ ఏరియాలో నివాసితులు కాని గిరిజనుల హక్కులు కూడా కాలరాయడమే. రాష్ట్రపతి ఉత్తర్వు- 371డీ ప్రకారం వారు మిగిలిన ఏరియాల్లో రిజర్వేషన్లు పొందడానికి వీల్లేకుండా పోతుంది’ అని బెంచ్‌ వివరించింది. కులాల జాబితాలు సవరించనంతకాలం,  కోటా నిబంధనలను సమీక్షించనంతకాలం రిజర్వేషన్ల విధానం విసిరే సవాళ్లను ఎదుర్కొనే రాజకీయ సంకల్పం ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు  ఉండడం కష్టమేనని సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. రాజ్యాధికారంలో భాగం పొందేందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చేసిన యత్నాలు ఫలించడం లేదనీ, వారు వివక్షకు గురవుతున్నారని, అందుకే రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిందనీ వివరించింది. సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు లక్షించారని, కానీ ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొటాయనీ, జాబితాలు మార్చక, రిజర్వేషన్‌ నిబంధనలు మార్చక అలానే వదిలేశాయనీ, ఫలితంగా... ఇవి అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని బెంచ్‌ నిష్కర్షగా విమర్శించింది. పైపెచ్చు.., రిజర్వేషన్‌ శాతం పెంచాలన్న వాదనలు, రిజర్వేషన్లలో సబ్‌ కోటా కోసం డిమాండ్లు క్రమేణా పెరిగిపోయాయని బెంచ్‌ తప్పుబట్టింది.

‘అసలు షెడ్యూల్డ్‌ ఏరియాలు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానం వేరు. సంస్కృతి వేరు. వారి న్యాయ విధానం, సాంస్కృతిక వైరుధ్యం మనలా ఉండవు. అందరికీ అందే విద్య వారికి చేరదు. ఫలితంగా వారు వెనకబడే ఉంటారు. అలాంటి వారికి చేయూతనివ్వాలి. వారిని ఆదిమ సంస్కృతి నుంచి బయటకు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. వారిని జంతుప్రదర్శనశాలలో ఉంచిన మనుషులుగా భావించరాదు. వారి ప్రాచీన నాగరికతను, సంప్రదాయ నృత్యాలను వినోద దృష్టితో చూడరాదు’’ అని బెంచ్‌ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.

రివ్యూ పిటిషన్‌ వేయాలి: తమ్మినేని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2000 సంవత్సరంలో వచ్చిన జీవో నం.3ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు అమలు జరగకుండా ేస్టఆర్డర్‌ పొందేలా తక్షణం జోక్యం చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

వేల మంది నష్టపోయారు

సుప్రీం తీర్పుపై పిటిషనర్‌ లీలాప్రసాద్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఏజెన్సీలో నూటికి నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే ఉండాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం దాకా వేలాది మంది గిరిజనేతర నిరుద్యోగులు నష్టపోయారని, వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని పిటిషనర్‌ చేబ్రోలు లీలాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమీక్షించి తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.  అప్పట్లో ఖమ్మం జిల్లాలో 2వేల పోస్టులు గిరిజనులకు కేటాయించారని, తద్వారా అన్ని అర్హతలున్నా ఉపాధ్యాయ పోస్టుకు తమని అనర్హులను చేశారని వాపోయారు. టీచరుగా పనిచేయాలన్న తన నెరవేరకుండా పోయిందంటూ...  ఇప్పుడు తనకు 40 ఏళ్లని, ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేదని, చిన్నరైతుగా చింతకాని మండలం పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నానని వివరించారు. అప్పట్లోనే తీర్పు వచ్చి ఉంటే తమ లాంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవని, ఇప్పుడు వచ్చిన తీర్పు ద్వారా న్యాయం గెలించిందన్న సంతృప్తి ఉన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుపొందలేదన్న బాధ ఉందన్నారు.

No comments:

Post a Comment